అలతి అలతి పదాల అన్నమయ్య..

Meena Yogeshwar
May 3, 2025

ఒకప్పుడు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని శివుడని కొందరు, అమ్మవారని కొందరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొందరు వాదించడం, కొన్నిసార్లు ఆయా దేవతా పూజలు ఆ విగ్రహానికి చేయడం తిరుమల చరిత్రలో ప్రస్పుటంగా record చేయబడిన చరిత్ర. ఆ చరిత్ర నిజమని తన కీర్తనలో మరోసారి నిరూపించారు...

అన్నమయ్య సినిమా విడుదలైనప్పుడు నా ఆరేళ్ళ వయసులో మొదటిసారి అన్నమయ్య పేరు విన్నాను నేను. అప్పట్లో ఆ సినిమాలోని అన్నమయ్య సంకీర్తనలు ఊరూ వాడా మార్మోగిపోయేవి. అంత చిన్న వయసులో ఉన్న నాకు ‘అదిగో అల్లదిగో శ్రీహరి వాసమూ’ కీర్తన చాలావరకూ ఎవరూ పెద్దగా వివరించనవసరం లేకుండానే అర్ధమైపోయేది. మా ఇంటి చూరులో ఒక చిన్న కన్నాన్ని చూపిస్తూ వచ్చీ రానీ steps తో అదిగో అల్లదిగో అని పాడుతూ ఆడడం ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిన విషయం.

ఎన్నో పాటలు ఆ చిన్ని వయసులో నా హృదయాన్నే కాదు, మెదడుని కూడా తాకాయి. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ పాట అప్పట్లో నా బుర్రలో ఎప్పుడూ నడుస్తూనే ఉండేది. మా అమ్మమ్మ ఎప్పుడైనా మడి, అంటు అని మాట్లాడితే నా మనసులో ఈ పాట వచ్చినంత పాడుకునేదాన్ని. ‘అంతయూ నీవే హరి పుండరీకాక్ష’, ‘జో అచ్యుతానంద’ వంటి పాటలు నాకు నోటికి వచ్చేసేవి. ఇలా నాకు కీర్తనల లోకంలోకి అడుగుపెట్టేలా చేసినది అన్నమయ్య. ఆ తరువాతే రామదాసైనా, త్యాగరాజైనా, ముత్తుస్వామి అయినా నా లోకంలోకి వచ్చారు. కీర్తనలపై మొదట మనసు పాడేసుకునేలా చేసింది మాత్రం అన్నమయ్యే. He is my first crush in carnatic music అంటే తప్పు లేదేమో.

కొంత పెద్దయ్యాకా తిరుమల, రామానుజుల చరిత్ర చదువుకున్నాకా అన్నమయ్య రాసిన ‘ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన’ కీర్తన నన్ను mesmerize చేసింది. ఒకప్పుడు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని శివుడని కొందరు, అమ్మవారని కొందరు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొందరు వాదించడం, కొన్నిసార్లు ఆయా దేవతా పూజలు ఆ విగ్రహానికి చేయడం తిరుమల చరిత్రలో ప్రస్పుటంగా record చేయబడిన చరిత్ర. ఆ చరిత్ర నిజమని తన కీర్తనలో మరోసారి నిరూపించారు అన్నమయ్య. నేను చూసినంతలో చరిత్రని, సామాజిక అంశాలని కీర్తనల్లో ఇమిడ్చిన వాగ్గేయకారులు చాలా తక్కువ.

చిన్నప్పట్నుంచీ నాటకాలు, కవితాగానాలు, కచేరీలు, అవధానాలు, హరికథలు, బుర్రకథలు ఇలా మేము చూడని కళ అంటూ లేదు. మా నాన్నగారు దగ్గరుండి అవన్నీ మాకు చూపించేవారు. అలాగే త్యాగయ్య, జాషువ, శ్రీశ్రీ, సురభీ నాటక కంపెనీ, వద్దిపర్తి పద్మాకర్ గారు, గరికపాటి నరసింహారావుగారు వంటి అన్ని కళారూపాల కళాకారులు మాకు తెలిసారు. వారి కళ మాకు పరిచయం అయింది. మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము తాడేపల్లిగూడెం వచ్చిన తరువాత మమ్మల్ని ‘అన్నమయ్య పద సుధ’ అనే కార్యక్రమానికి తీసుకువెళ్ళేవారు.

మా నాన్నగారి గురువుగారు శ్రీ తమ్మా సత్యనారాయణ గారు నిర్వహించే విలక్షణమైన అన్నమయ్య కచేరీ ఇది. తమ్మా సత్యనారాయణ గారు అసలు సాంఘిక శాస్త్ర అధ్యాపకులు. వారు పెయింటింగ్ కూడా వేసేవారు. ఆయన దగ్గరే మన ప్రముఖ కార్టూనిస్ట్ సరసి గారు బొమ్మలు నేర్చుకున్నది. సత్యనారాయణ గారు అన్నమయ్య పద సుధ కార్యక్రమంలో అన్నమయ్య కీర్తన గురించి, అందులోని భావం అర్ధం వంటి విషయాల గురించి, కొంత చరిత్ర గురించి వివరించాకా, గాయకులు ఆ పాట పాడేవారు. అలాంటి విలక్షణమైన కచేరీ మాకు అన్నమయ్యనే కాక, ఆయన పదాలను కూడా చేరువ చేసేది.

గత నెలలో మన కూటమి సభ్యులు నళనీకాంత్ వల్లభజోశ్యుల గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏమిటంటే, వైశాఖ పూర్ణిమ అన్నమయ్య జయంతి కాబట్టీ, అన్నమయ్య పై ప్రసంగం నిర్వహిస్తే బాగుంటుంది అని. వారు ఒకరిని సూచించారు కూడా. అయితే, వారిని సంప్రదించడం మనకు వీలవలేదు. ఈలోపు నా nostalgia ఒక్కసారి నన్ను hit అయింది. స్టేజి కింద కుర్చీలో కూర్చుని తల ఊపుతూ అన్నమయ్య కీర్తనలు ఆస్వాదించిన బుల్లి మీనా గుర్తుకువచ్చింది. సత్యనారాయణ మాస్టారు గారిని నేను host చేయగల అవకాశం ఇంత దగ్గరగా వచ్చినా, నాకు కనపడలేదా అని ఆశ్చర్యం వేసింది.

వెంటనే వారిని సంప్రదించగా, వారు చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. నేను నా చిన్నప్పుడు అనుభవించిన ఆ ఆనందానుభూతిని మీతో కూడా పంచుకుంటాను. ఆ జ్ఞాపకాల మూటలు విప్పి, మే నెల మొదటి శనివారం అంటే, 3వ తారీఖు ఉదయం 9.30కల్లా మాస్టారితో పాటుగా సిద్ధంగా ఉంటాను. ఆ గతకాలపు స్మృతుల సువాసనలు మీరూ అనుభవిద్దురుగాని రండి. అన్నమయ్య వేంకటేశ్వరునికి ‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే’ అంటూ కీర్తనలు అప్పగిస్తే, ఈ చిరు కార్యక్రమంతో మనమూ అన్నమయ్యని అలాగే కీర్తిద్దాం.

చంద్రునికో నూలు పోగు - నవల

ఈ మధ్య మా ఇంటాయన నాలో ఒక పోకడ గమనించి నన్ను హెచ్చరించారు. ఇంట్లో పెంచడానికి నేను అన్ని రకాల మొక్కలూ కొంటాను. కూరలు, పూలు, ఆకుకూరలు పళ్ళు ఇలా అన్ని రకాలు పెంచడానికి ఇష్టపడుతుంటాను. కానీ అసలు పూలు, పళ్ళు పూయని, కాయని క్రోటన్ మొక్కలంటే నాకు నచ్చదు. మనం పెంచితే, ఏదో ఒక రకంగా ఆ మొక్క పనికి రావాలి. అంతే కానీ, అలంకరణ కోసం క్రోటన్ లు పెంచడం నాకు నచ్చదు. దీనిని నేను మాట్లాడే వేరే మాటకి ముడిపెట్టి నాకు వివరించారు మా సారు.

‘నువ్వే అంటావు కదా, కళ అనేది కళ కోసమే తప్ప దానికి ఏవో ప్రయోజనాలు ఉండడం ముఖ్యం కాదు, సంపాదనో, కీర్తో గడించాలనుకోవడం తప్పు కాదు కానీ, అలా గడించడాన్ని ఈసడించడం సరికాదు అని, మరి మొక్క పెంచడం మొక్క కోసమే కానీ, దానిని నుండి ఫలితం ఆశించడం తప్పు కదా’ అన్నారు. అమ్మా గట్టి దెబ్బే కొట్టారే అయ్యగారు. నా డైలాగ్ నాకే ఇంకో రూపంలో తిప్పి కొట్టారు అనుకున్నాను. నిజంగా ఈ విషయంలో నాకు ఓ ఖచ్చిత అభిప్రాయం ఉంది. చాలామందికి సంపాదనో, కీర్తో తీసుకురాని కళ పనికిమాలిన వస్తువుతో సమానం. మరికొందరికి కళని అమ్ముకుని పొట్ట పోషించుకుంటున్నారు అని అభిప్రాయం.

నా వరకూ మాత్రం కళ కేవలం కళగా ఉండడం కోసమే అయినా, లేదంటే డబ్బో పేరో సంపాదించినా తప్పు లేదు అనిపిస్తుంది. ఎవరి priorities వారివి కదా. తన భాగవతాన్ని అమ్ముకునే రోజు రాకూడదు అని ఏడ్చిన పోతనా గొప్పవాడే, రాజుల పోషనలో ఉంటూ అద్భుతమైన కవిత్వాన్ని తెలుగు భాషకు అమర్చిన శ్రీనాధుడూ గొప్పవాడే. ఒక్కసారి ఆలోచించండి, నవలలను ప్రచురణకర్తలకు అంకితమిస్తూ, డబ్బులు ఆర్జించకపోయి ఉంటే విశ్వనాథ అరవయ్యేసి నవలలు రాయగలిగేవారా?

కళ దేనికోసం? ఆర్జనకా ఆత్మసంతృప్తికా అనే సున్నితమైన ప్రశ్న ఒక నవలా రూపంలో వస్తే అది ప్రముఖ రచయిత, సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు రాసిన ‘చంద్రునికో నూలుపోగు’ నవల అవుతుంది. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో రాసిన ఈ నవలలోని చాలా అంశాలు ఇప్పటికీ చక్కగా సరిపోవడం విచిత్రం. ఈ వారం శర్మ గారి ఈ నవల విడుదల అవుతోంది. వినేయండి మరి.

Tap to Listen

Note: ఈ నెల 22వ తేదీ కాశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి దాసుభాషితం నివాళి అర్పిస్తోంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన మరోసారి జరగకూడదు అని, దానికి తగ్గ నివరణా చర్యలు భారత ప్రభుత్వం తీసుకోవాలి అని ఆశిస్తున్నాం. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాలకు శాంతి, ధైర్యం చేకూరాలని ప్రార్ధిస్తున్నాం. భారతదేశం అంతా కుల, మత, జాతి, రాజకీయాలకు అతీతంగా నిలబడి పోరాడాల్సిన సమయం ఇదే అని మనమందరం గుర్తుంచుకోవాలి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :