‘వదిలేస్తే ఆంధ్ర కూడా మణిపూర్ అయిపోతుంది’

Meena Yogeshwar
June 14, 2025

అణచివేతలు, ఊచకోతలు, హక్కులు కాలరాయడాలు మన భారతదేశానికి కొత్తేం కాదు. ముఖ్యంగా అణగారిన వర్గాలంటే కార్పొరేట్ నుండి ప్రభుత్వం వరకూ, పెత్తందారుల దగ్గర నుండి అధికారుల వరకూ, ఆఖరికి సామాన్య కుటుంబస్తుడికి కూడా చులకనే. అంతిమ జాతుల వారిగా, కొండజాతివారిగా వారికి మన రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినా అవన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరే’ అయ్యాయి. ముఖ్యంగా కొండజాతుల వారి విషయంలో...

సరిగ్గా రెండేళ్ళ నుండి మణిపూర్ కాష్టంలా కాలుతూనే ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మే 3, 2023న మొదలైన ఈ అంతర్యుద్ధం వలన 22 నవంబర్ 2024నాటికి చనిపోయిన వారి సంఖ్య 258, తమ ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టబడి చెల్లాచెదురు అయిపోయిన వారి సంఖ్య అరవై వేలు, గాయపడినవారి సంఖ్య 1000కు పైగా, తప్పిపోయిన వారు 32 మంది, తగలబడిన ఇళ్ళ సంఖ్య 4786, నాశనం చేయబడిన ప్రార్ధనా స్థలాలు(చర్చ్ లు, ఆలయాలు కలిపి) 386.

ఈ లెక్కలు నవంబర్ 2024నాటివి. పైగా అధికారిక లెక్కలు. అనధికార లెక్కలు ఇంకా ఎక్కువే ఉంటాయని అంచనా. కుకి, మేథీ తెగల మధ్య మే 3న మొదలైన ఈ అల్లర్లు, జులై 19న ఇద్దరు ఆడవాళ్ళను వివస్త్రలను చేసి, నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేస్తూ తీసిన వీడియో బయటకు వచ్చే వరకూ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు ఏమీ తెలియదు. అంతకాలం ప్రధాన మీడియా పెదవి విప్పకుండా జాగ్రత్తగా దాచిపెడుతూ వచ్చింది. అల్లర్ల పేరు చెప్పి ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేయడం వలన సోషల్ మీడియాలో తెలిసే అవకాశం లేదు. స్వతంత్ర మీడియా ఈ విషయాన్ని బయటపెట్టేందుకు చేసిన అన్ని ప్రయత్నాలనూ విఫలం చేసింది ప్రభుత్వం.

ఇంతటి దారుణ దమనకాండను రెండు జాతుల మధ్య, రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న ఆకతాయి అల్లరిగా సృష్టించడానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వ యంత్రాంగం, ప్రధాన మీడియా. సుప్రీం కోర్ట్ కలగజేసుకుని, వారించేంత వరకూ అసలు ఆ యుద్ధం జరుగుతోంది అని నమ్మడానికే అధికారంలో ఉన్నవారికి ఇష్టం లేకపోయింది. నేను ఒక ప్రభుత్వాన్నో, ఒక పార్టీనో, ఒక నేతనో అనడం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. సమస్యను acknowledge చేయడం వీక్ నెస్ గా, తక్కువతనంగా భావించి, కాకిపుండు బ్రహ్మరాక్షసి చేసుకుంటున్నాం.

ఇలాంటి అణచివేతలు, ఊచకోతలు, హక్కులు కాలరాయడాలు మన భారతదేశానికి కొత్తేం కాదు. ముఖ్యంగా అణగారిన వర్గాలంటే కార్పొరేట్ నుండి ప్రభుత్వం వరకూ, పెత్తందారుల దగ్గర నుండి అధికారుల వరకూ, ఆఖరికి సామాన్య కుటుంబస్తుడికి కూడా చులకనే. అంతిమ జాతుల వారిగా, కొండజాతివారిగా వారికి మన రాజ్యాంగం ఎన్ని రక్షణలు కల్పించినా అవన్నీ ‘బూడిదలో పోసిన పన్నీరే’ అయ్యాయి. ముఖ్యంగా కొండజాతుల వారి విషయంలో మరింత అన్యాయం చూస్తూ వచ్చాం. వారికి తమ భూమిపై ఇచ్చిన ప్రత్యేక హక్కు గురించి, రిజర్వేషన్ గురించి ఎందరికి వ్యతిరేకత ఉందో చెప్పలేం.

చక్కటి పల్లెటూర్లు, పట్టణాలు, మెట్రో నగరాల్లో చదువు, ఆరోగ్యం, ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నిట్లోనూ మంచి వసతులే కాక, కుటుంబపరంగా అన్ని విషయాల్లోనూ మంచి వారసత్వం కలిగిన మనకి, దోమ కుడితే పుటుక్కున రాలిపోయే పరిస్థితుల్లో బతుకుతున్న వారితో పోటీ? చదువుకోవాలంటే సామాజిక అంశాల నుండి ఆర్ధిక అంశాల నుండి రోడ్ల వ్యవస్థ వంటి వ్యవహారిక అంశాల దాకా అన్నిచోట్ల అడ్డంకులు దాటాల్సిన వారితో మనకి పోటీ? వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు? వాళ్ళకి మాత్రమే ఆ భూమి చెందుతుంది అనే హక్కు ఎందుకు? అని లాజిక్ లు లాగడానికి మనకున్న తెలివంతా ఉపయోగిస్తామే కానీ, ఒక్కరోజైనా వారిలా బ్రతకగలమా? బ్రతికి, ఇప్పుడు మనకున్న స్థితికి ఆ సౌలభ్యాలు లేకుండా చేరగలమా? ఉన్నా చేరడం కష్టం.

అసలు వారి జీవనం, కష్టాలు, అవసరాలు, కట్టుబాట్లు, అలవాట్లు, వారసత్వం, సంప్రదాయాలు వీటిల్లో ఏ ఒక్క విషయంలోనైనా సగటు వ్యక్తికి సరైన అవగాహన ఉందా? ఉండదు. ఎందుకంటే, వీటి గురించి మాట్లాడం కాబట్టి. Popular entertainment లో ఈ విషయాలు కనబడవు కాబట్టీ. ఎక్కడో వంశీ లాంటి తెలుగు రచయితలు, గోపీనాధ్ మొహంతి లాంటి ఒడియా రచయితలు, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ లాంటి బెంగాలీ రచయితలు, నారాయణ్, దసన్నూర్ నారాయణన్, లిజిన లాంటి మలయాళీ రచయితలు రాసిన రచనలు కాస్త ప్రజాదరణకు నోచుకున్నాయి. వారి కలం నుండి కొండజాతి వారి జీవితాలను చూసిన పాఠకులకు కాస్త అవగాహన ఉండే అవకాశం ఉంది.

అలా ప్రజల కష్టాలు, ముఖ్యంగా కొండజాతి వారి కడగండ్లను కళ్ళకు కట్టిన ప్రముఖ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాధ్ మొహంతి ఒరిస్సా ప్రాంతంలోని పరజా అనే కొండజాతి తెగలోని ఒక అభాగ్యుడి కథను ఈ ‘పరజా’ నవలలో చెప్పారు. అధికారుల లంచగొండితనానికి, పెత్తందారు ధనదాహానికి, అహానికి ఛిన్నాభిన్నమైపోయిన ఒక పేద రైతు కుటుంబమే ఈ నవలలోని ప్రధాన నాయకులు. ఈ నవలపై విశ్లేషణ ప్రముఖ రచయిత, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు చేశారు. ఈ వారం ఈ విశ్లేషణ విడుదల అవుతోంది.

Tap to Listen

ఇక సినిమాల్లో ఈ తరహా సినిమాలు అరుదు. ఈ మధ్య విడుదలైన ‘కాంతార’ చాలావరకూ కొండజాతి ప్రజల జీవనాన్ని, అమాయకత్వాన్ని, సంప్రదాయాలను, వారిని ప్రభుత్వం, పెత్తందార్లు దోచుకుంటున్న విధానాన్ని చాలా చక్కగా చూపెట్టింది. ఈ ఇతివృత్తం కలిగిన సినిమా భారతదేశం మొత్తం మీద సూపర్ హిట్ అయ్యి, అన్ని కోట్ల కలెక్షన్స్ రావడం మంచి విషయం. అయితే, సినిమా చూసిన ప్రతీవారూ ఈ conflict ను అర్ధం చేసుకోలేదు అన్నది చేదు వాస్తవం. చాలామంది పంజుర్లి దేవత, కోలం సంబరం దగ్గరే ఆగిపోయారు. సంస్కృతిని, conflict ని ఎంతో చక్కగా blend చేసిన దర్శకుడు పూర్తిగా సఫలం చెందకపోవడం బాధాకరం.

ప్రస్తుతం తెలుగు సాహిత్యానికి చాలా మంచి కాలం నడుస్తోంది. తెలుగు పుస్తకాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి. నేటి తరం తిరిగి పుస్తకం వైపుకు నడుస్తోంది. ఇలాంటి సమయంలోనే Mainstream సాహిత్యంలోనూ, సినిమాలోనూ అన్ని వర్గాలపైనా, అన్ని సమస్యలపైనా, అన్ని ప్రాంతాలపైనా సృజన వెలువడాలి. Nationalism, అంతర్జాతీయ వేదికపై మన దేశ స్థితి ఇలాంటి విషయాలు చర్చించడం, వీటిపై ఆసక్తి కలిగి ఉండడం చాలా ముఖ్యం. అంతకన్నా ముఖ్యమైన పని స్థానికంగా ఏం జరుగుతోందో తెలుసుకోవడం. 

మూలాల్లో, చెట్టు వేరులో ఏదైనా సమస్య ఉంటే అది మొత్తం చెట్టునే నాశనం చేస్తుంది. స్థానిక సమస్యల గురించి గొంతు ఎత్తక, దేశ సమస్యలపైనే ప్రత్యేక దృష్టి పెడితే మణిపూర్ లాగానే మరో రాష్ట్రమూ రావణ కాష్టం కావడం తధ్యం. 

‘One Nation, One Language, One Culture’ అనే దారి భారతదేశం లాంటి దేశానికి పని చేయదు. ఎన్నో భాషలు, జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు కలిసిమెలసి పెనవేసుకున్న హరివిల్లు భారతదేశం. ‘Unity in Diversity’ అనే దారే మనల్ని ఆరోగ్యవంతంగా సుదూర భవిష్యత్ కు చేరుస్తుంది.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :